నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ మరియు ఫిలిమ్ మేకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పల్లె వాతావరణంలో ఘనంగా సంక్రాంతి ముందస్తు సంబరాలు చేసుకున్నారు. యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ లు విద్యార్థులు చేసిన సంక్రాంతి వేడుకలను వీక్షించి అభినందనలు తెలియజేసారు. ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యన్. విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజులపాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అని అన్నారు. విద్యార్థులకు మరియు వారి తల్లితండులకు యూనివర్సిటీ తరుపున మరియు సిబ్బంది తరుపున మంచి జరగాలని కోరుతున్నానని అన్నారు. 'మకర సంక్రాంతి' పండుగ అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్నల ఆటలకు, గాలిపటాలు ఎగురవేయటానికి, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది అని, అందరూ ఉత్సాహం తో పండుగ జరుపుకోవాలని ఆయన అన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా గ్రామీణ సంస్కృతి, రైతు జీవితానికి సంబంధించిన అంశాలను ప్రతిబింబించే కార్యక్రమాలు విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సంప్రదాయాల ప్రాముఖ్యతను నేటి యువతకు అవగాహన కల్పిస్తూ, సాంకేతిక విద్యతో పాటు సాంస్కృతిక విలువలకు మిట్స్ యూనివర్సిటీ ప్రాధాన్యతను చాటిచెప్పుతున్నదని తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ అయిన తరువాత మొదటి సంవత్సరంలో మొదటి సంక్రాంతి వేడుకలో భాగంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో తమ వంతు కృషి చేయాలని అధ్యాపకులకు తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, డీన్, విభాగాధిపతులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు భోగి మంటల చుట్టూ కోలాటాలు, నృత్యాలు చేస్తూ అలరించడమే కాకుండా గాలిపటాలు ఎగరేస్తూ యూనివర్సిటీ లో సందడి చేశారు.
Reporter
Namitha News