నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి, మే 18: జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ సూచించారు. మదనపల్లిలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకును క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంకులోని రక్త నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. బ్లడ్ బ్యాంకులు ప్రతి నెల కనీసం 24 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు అందించాలని తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన బ్లడ్ బ్యాంకుల్లో మాత్రమే రక్తదానం చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమంగా రక్త వ్యాపారం లేదా బ్లీడింగ్ నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రక్తాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజల్లో రక్తదానం అవసరంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు
Reporter
Namitha News