నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 30 : అన్నమయ్య జిల్లాలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 'శక్తి' బృందాలు మరియు స్థానిక పోలీసులు భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం మరియు సామాజిక రుగ్మతలపై ప్రజలను చైతన్య పరిచారు. *అండగా శక్తి బృందాలు:* మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాయి. ఆపద సమయంలో 'శక్తి యాప్' ఏ విధంగా రక్షణగా నిలుస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. ఆకతాయిల వేధింపులకు గురైనా, అపరిచిత వ్యక్తుల నుండి ఇబ్బందులు ఎదురైనా సంకోచించకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా 'పోక్సో' చట్టంపై అవగాహన కల్పిస్తూ.. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. *బాల్య వివాహాలు.. సామాజిక నేరం:* గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను పోలీసులు వివరించారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, వారి భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. *మత్తుకు దూరంగా.. చదువుకు దగ్గరగా:* యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల జీవితాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింక్లను క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని, నగదును పోగొట్టుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోలీసు అధికారులు మరియు శక్తి బృందాలు అవగాహన కల్పించారు
Admin
Namitha News