నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 ః కుక్కరాజు పల్లి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం జరిగితే పరిశ్రమలతో పాటు యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సూచించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తోపాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తంబళ్లపల్లె మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కుక్క రాజు పల్లి లో ఏపీఐఐసీకి కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల కోల్పోతున్న రైతులు దశాబ్దాలుగా ఈ భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని ఈ భూమి కోల్పోతే మాకు జీవనాధారం లేదని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.తమను అ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ ఎం ఎస్ ఎం ఈ పార్క్ నిర్మాణం తో ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది భవిష్యత్తులో భూముల ధరలు పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారం జరిగి తంబళ్లపల్లెకు తలమానికంగా నిలుస్తుందని రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుందని సహకరించాలని మరోసారి నచ్చచెప్పారు. అనంతరం కోటకొండ సచివాలయం తనిఖీ చేసి సచివాలయ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరు స్థానిక సమస్యల పరిష్కారం పై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది గ్రామాలలో తాగునీరు, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో గుర్తించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం కోటకొండ లో జరుగుతున్న వి బి జి రామ్ జి ఉపాధి హామీ జలధార కార్యక్రమంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి చెంది జలదార కార్యక్రమం ద్వారా ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా పనులు చేపట్టాలని, ప్రతి కూలికి పని కల్పించాలని సూచించారు. తదుపరి రేణుమాకులపల్లి పంచాయతీలో గతంలో జరిగిన భూరీసర్వేలో జరిగిన తప్పిదాలపై అడిగి తెలుసుకుని నేడు చేపట్టిన భూ సమస్యల పరిష్కారం పై తాసిల్దార్ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. భూ రిసర్వే లో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు ఆరు మంది ప్రత్యేక కమిటీ తో పూర్తిస్థాయి సర్వే జరుపుతున్నట్లు జాయింట్ కలెక్టర్కు వివరించారు. అనంతరం తంబళ్లపల్లె లో పౌరసరఫరాల గోడౌన్ ను జాయింట్ కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోడౌన్ లోని నిత్యావసర సరుకులు రికార్డులతోపాటు బియ్యం, పప్పులు నిత్యవసర సరుకులను సుమారు అరగంట పాటు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టోర్ డీలర్లకు సకాలంలో రేషన్ సరుకులు అందుతున్నాయా ఇతర సమస్యలపై జిల్లా ఇన్చార్జి డిఎస్ఓ సుమతి, డిటి నారాయణరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ ఐ ముద్దుకృష్ణ, సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, స్టోర్ డీలర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News