నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మదనపల్లె సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కె. పునీత్ కుమార్, బి. హర్ష వర్ధన్, ఆర్. జీవన్ కుమార్, ఎస్. సుహెల్ మరియు ఎం. సంతోష్ కుమార్లు పట్టణ ప్రాంతాల్లో చివరి మైలు (Last-Mile) రవాణా సవాళ్లకు సుస్థిర పరిష్కారంగా “మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్” అనే వినూత్న విద్యుత్ వాహనాన్ని అభివృద్ధి చేశారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. పర్యావరణ హితమైన, తక్కువ వ్యయంతో కూడిన ఈ మూడు చక్రాల వాహనం కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాన్ని అందించేలా రూపకల్పన చేయబడిందని తెలిపారు. 1000 వాట్ల BLDC మోటార్ మరియు 48 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేసే ఈ వాహనం, ఒక్కసారి పూర్తి ఛార్జ్తో సుమారు 45 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. మూడు చక్రాల స్థిరమైన నిర్మాణం కారణంగా ఇది ముఖ్యంగా వృద్ధులు మరియు ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు మరింత అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్లు, రిసార్ట్లు, టౌన్షిప్లు, ఆసుపత్రులు మరియు ఇతర గేటెడ్ ప్రాంగణాల్లో అంతర్గత రవాణా అవసరాల కోసం రూపొందించిన ఈ ఈ-ట్రైక్ను సుమారు రూ.35,000 వ్యయంతో అభివృద్ధి చేశారు. తక్కువ ధరలో సమర్థవంతమైన రవాణా పరిష్కారాన్ని అందించే ఈ నమూనాను భవిష్యత్తులో స్టార్టప్ ద్వారా వాణిజ్య ఉత్పత్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని విద్యార్థులు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు మార్గదర్శకత్వం వహించిన మెంటార్ పి. ఎం.డి. రిజ్వాన్ అలీ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. భాస్కరన్ విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం మరియు ఆవిష్కరణాత్మక దృక్పథాన్ని ప్రశంసించారు. పర్యావరణ అనుకూలమైన, అందరికీ అందుబాటులో ఉండే మరియు సుస్థిర రవాణా భవిష్యత్తుకు దోహదపడే విద్యార్థి నేతృత్వంలోని ఆవిష్కరణగా ఈ “మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్” నిలుస్తోంది అని అన్నారు. నూతన ఆవిష్కరణ చేసిన విద్యార్థులను మరియు సహకరించిన అధ్యాపకులను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల మరియు అధ్యాపకులు అభినందించారు
Reporter
Namitha News