నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకి వ్యతిరేకంగా ఈనెల 12న మదనపల్లిలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రామసముద్రం మండల వైసీపీ కన్వీనర్ కేశవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం వైఎస్ఆర్సిపి తలపెట్టే ర్యాలీని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. గత వైసిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారి ఉన్నత భవిష్యత్తు కోసం మెడికల్ కళాశాలలను స్థాపించారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేలా చర్యలు తీసుకుందన్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ఆటంకం కలిగిందని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిర్వహిస్తున్న రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్యస్పందన వస్తుందని పేర్కొన్నారు. చిత్తూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందని, ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరవుతున్నట్లు కేశవరెడ్డి తెలియజేశారు.
Reporter
Namitha News