నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 18 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం కుంభాభిషేకం, వరుణ యాగం వైభవోపేతంగా నిర్వహించినట్లు దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లు తెలిపారు. ఉదయం వారి ఆధ్వర్యంలో వేద పండితుడు సంజీవ పవన్ కుమార్ శర్మ మరియు ఆలయ అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు మహా శివునికి పుష్పాలంకరణ,ప్రత్యేక పూజలు, కుంకుమార్చన,అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో అశేష జనవాహిని మధ్య పెద్ద ఎత్తున వరుణ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, శివునికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, భక్తులు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రత్యేక ప్రార్థనలతో ఆర్తించారు. ఈ కార్యక్రమం అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. కుంభాభిషేకానికి నియోజకవర్గ స్థాయిలో వేలాదిగా భక్తులు తరలి రావడంతో మల్లయ్య కొండ భక్తులతో కిటకిటలాడింది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా వందలాదిగా ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు.
Reporter
Namitha News