నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె ఓటర్ల జాబితాలో తీవ్ర అవకతవకలు - వార్డుల మార్పుతో అయోమయానికి గురవుతున్న ఓటర్లు - జిల్లా కలెక్టర్,మునిసిపల్ కమిషనర్లకు వైసీపీ వినతి మదనపల్లె : మున్సిపాలిటీ ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో తీవ్ర స్థాయిలో తప్పులు,అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది.వాస్తవంగా ఒక వార్డులో నివసిస్తున్న ఓటర్లను ఎలాంటి సంబంధం లేని ఇతర వార్డులకు మార్చడం ద్వారా ఓటర్లను తీవ్ర అయోమయానికి,ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంది.ఈ విషయంపై వైఎస్సార్సీపీ తరఫున సోమవారం 164-మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఎస్.నిసార్ అహ్మద్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,మునిసిపల్ కమిషనర్ ప్రమీలకు వినతిపత్రం సమర్పించి,ఓటర్ల జాబితాలోని అవకతవకలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా విడుదలైన ఓటర్ల జాబితాలో అనేక మంది ఓటర్లను వారి వాస్తవ నివాస ప్రాంతాలకు సంబంధం లేని వార్డులకు మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందని నిసార్ అహ్మద్ తెలిపారు.ఉదాహరణకు వి.శ్రీనివాసులు రెడ్డి ఇంటి నంబర్ 15-50,శ్రీరాములు వీధిలో నివసిస్తున్నప్పటికీ, వాస్తవంగా వార్డు నంబర్ 13 పరిధిలోకి రావాల్సిన ఆయనను వార్డు నంబర్ 15లో సీరియల్ నంబర్ 1130గా చేర్చారని తెలిపారు.అదేవిధంగా అదే ప్రాంతంలో నివసిస్తున్న శ్రావణ్ రెడ్డిని వార్డు నంబర్ 14లో సీరియల్ నంబర్ 670గా చూపించారని పేర్కొన్నారు.మరోవైపు ఇంటి నంబర్ 17/89-5-2-2-Bలో నివసిస్తున్న వ్యక్తిని వార్డు నంబర్ 13లో సీరియల్ నంబర్ 886గా చేర్చినట్లు తెలిపారు.ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమేనని,వార్డు నంబర్ 13 ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో వాస్తవ నివాస చిరునామాలతో సరిపోల్చి యాదృచ్ఛికంగా పరిశీలించినా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిసార్ అహ్మద్ అన్నారు.మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి మాట్లాడుతూ ఒక వ్యక్తి ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో, ఆ ప్రాంతానికి సంబంధం లేని వార్డులో ఆయన ఓటును ఎందుకు చేర్చారో అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు ఒక వార్డులో ఉండి, నివాసం మరో వార్డులో ఉంటే స్థానిక సమస్యల పరిష్కారం కోసం సంబంధిత ఓటరు ఎవరిని సంప్రదించాలనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీ,పరిశీలనలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సరైన సమన్వయం,సంప్రదింపులు జరగడం లేదనే ఆందోళన కూడా ఉందన్నారు.ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అనుసరించిన విధంగానే రాజకీయ పార్టీలను ఓటర్ల జాబితా పరిశీలన,ధృవీకరణ,సవరణ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని, ప్రజలు కూడా తమ ఓటును వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషన్ పోర్టల్ లో పరిశీలించుకోవాలని సూచించారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని మదనపల్లె మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలోని అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని,ప్రతి వార్డులో ఓటర్లను వారి వాస్తవ నివాస చిరునామాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని,ఓటర్లకు అభ్యంతరాలు,సవరణల కోసం స్పష్టమైన మరియు అందుబాటులో ఉండే అవకాశం కల్పించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను పరిశీలన,సవరణ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలన్నారు.ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు అవసరమైన అన్ని ప్రజాస్వామ్య,శాంతియుత మార్గాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ జింకా చలపతి,వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్.రెడ్డి,మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏకరీముల్లా,మాజీ కౌన్సిలర్లు ఎన్ ఇర్ఫాన్ ఖాన్,గుండ్లూరు రఫీక్,రాజేష్,ఈశ్వర్ నాయక్,శ్రీనివాసులు,పాల్ చంద్రశేఖర్,ఆంజనేయులు,నాయకులు చిప్పిలి మల్లికార్జున రెడ్డి మాధవ రెడ్డి,సోషల్ మీడియా కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి,సాంబశివా రెడ్డి,గ్రానైట్ మహేశ్,ఎన్.నవాజ్ అలీ ఖాన్,బయ్యారెడ్డి,బొమ్మిశెట్టి మధు,నాగిరెడ్డి,సాంబశివారెడ్డి,ఆవుల విశ్వనాథ్,సుబ్రహ్మణ్యం,షేక్ జబి,నూర్ మొహియుద్దీన్ ఖాన్,నరసింహులు నాయుడు,శారదా రెడ్డి తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News