నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనవసర ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించండి - ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా - పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు మానుకోండి - టిడిపి నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు ముసలికుంట నాగయ్య హితవు మదనపల్లె : మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధి,ప్రజా శ్రేయస్సుకై పరితపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై విమర్శలు చేయడం తగదని,అనవసర ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బిసి సెల్ అధ్యక్షులు ముసలికుంట నాగయ్య హితవు పలికారు.గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీసీ నాయకులు ముద్దిమడుగు రామ్మూర్తి,కలిచెర్ల రామ్మూర్తిలతో కలసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముసలికుంట నాగయ్య మాట్లాడుతూ ప్రజల దశాబ్దాల కల అయినటువంటి మదనపల్లి జిల్లాను సాకారం చేసిన ఘనత షాజహాన్ బాషాకే దక్కుతుందన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి మదనపల్లి సమస్యలను తీసుకెళ్లడంతోపాటు పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పనకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించారన్నారు.నియోజకవర్గంలో సిసి రోడ్లు,డ్రైనేజీల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేశారన్నారు.ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాలలో సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు.మదనపల్లి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికై చరిత్ర సృష్టించడమే కాకుండా నియోజకవర్గాన్ని గణనీయమైన అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఏకైక నాయకుడని కొనియాడారు.అంతేకాకుండా నియోజకవర్గంలో బడుగు,బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ వారికి అండగా నిలిచారని ప్రశంసించారు.త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.దీనిని జీర్ణించుకోలేక కొంతమంది ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని ఇది సమంజసం కాదని,ఇటువంటి ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చవద్దని ఆయన సూచించారు.
Reporter
Namitha News