నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియం “టెరా-2కె26” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2006–2010 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థి, ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. శ్రీధర్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ నాథన్, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగుతూ పరిశ్రమలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సు ఎప్పటికీ ‘ఎవర్గ్రీన్’ అని పేర్కొంటూ, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విద్యుత్ శాఖలు, రైల్వేలు, డిఫెన్స్, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రికల్ డిజైన్, మెయింటెనెన్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి విభాగాల్లో అవకాశాలు ఉన్నాయని వివరించారు. రిన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ గ్రిడ్స్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలను నేర్చుకుంటే మరింత మంచి కెరీర్ సాధ్యమవుతుందని తెలిపారు. సరైన సాంకేతిక నైపుణ్యాలు, ప్రాక్టికల్ అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఉద్యోగాలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ నాథన్, డీన్ డాక్టర్ దీపాంకర్ రాయ్, అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఏ.వి. పవన్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ మనవాళన్ గుణశేఖరన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News