నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 31: కరువు ప్రభావిత ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో స్పష్టమైన ప్రణాళిక, శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో జలధార ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) స్పెషల్ కమిషనర్ పి. ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాలో జలధార ప్రాజెక్టు అమలును అధ్యయనం చేయడానికి వచ్చిన కడ అధికారులు, జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం కలెక్టర్తో సమావేశమైంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ, జిల్లాలో జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, కాలువల శుద్ధి, నీటి మళ్లింపు వంటి చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. ఈ చర్యల వల్ల వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయి మెరుగుపడిందని, జలధార కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా లేబర్ బడ్జెట్ను నీటి సంరక్షణ పనులకు వినియోగించడం వల్ల భూగర్భ జలాలు పెరిగి పచ్చదనం, పశుగ్రాసం లభించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. జలధార ప్రాజెక్టు విజయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారికి వివరించగా, ముఖ్యమంత్రి మరియు సీఎస్ గారి ప్రశంసలు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు
కడ స్పెషల్ కమిషనర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టు అమలు తీరుపై ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. విజయనగరం, బాపట్ల జేఎన్టీయూ ప్రొఫెసర్లు మరియు కడ అధికారులతో కలిసి రైల్వేకోడూరు, చిట్వేలు, పుల్లంపేట, రాజంపేట, మదనపల్లి ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం చేసిన విషయాలను ప్రభుత్వానికి నివేదికగా సమర్పిస్తామని తెలిపారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు డ్వామా పీడీ వెంకటరత్నం ఆధ్వర్యంలో జలధార ప్రాజెక్టు కింద చేపట్టిన నీటి సంరక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్, కడ స్పెషల్ కమిషనర్ మరియు వారి బృందం పరిశీలించారు
ఈ సమావేశంలో జల వనరుల శాఖ ఎస్ఈ విఠల్ ప్రసాద్, డ్వామా పీడీ వెంకటరత్నం, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్ళైతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు
Admin
Namitha News