నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం - కారును ఢీకొన్న కంటైనర్ : ఇద్దరు దుర్మరణం - రెండు కుటుంబాలలో నెలకొన్న విషాదఛాయలు మదనపల్లె : చెన్నై - ముంబై జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.ములకలచెరువు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.మదనపల్లె పట్టణం,సప్తగిరి నగరులో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ వెంకటరమణ (65) నీరుగట్టువారిపల్లిలో నివాసముంటున్న రాజశేఖర్ లు దగ్గరి బంధువులు.అనంతపురం మండలం,సాపిరెడ్డివారిపల్లిలో జరుగుతున్న బంధువుల వివాహానికి వెంకటరమణ,రాజశేఖర్లు మంగళవారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారులో బయలుదేరి వెళ్లారు.బుధవారం ఉదయం వివాహమనంతరం తిరిగి అదే కారులో స్వగ్రామానికి బయలుదేరారు.మార్గమధ్యలోని వేపూరికోట,బురకాయలకోట మధ్యలో వీరి కారును అనంతపురం వైపు వెళుతున్న కంటైనర్ ఢీకొంది.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ఉన్న వెంకటరమణ,రాజశేఖర్లు సంఘటనా స్థలంలోని దుర్మరణం పాలయ్యారు.సమాచారం అందుకున్న ములకలచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రిటైర్డ్ కండక్టర్ వెంకటరమణకు భార్య ఇందిరమ్మ,కుమారుడు నవీన్ కుమార్,హరితలు ఉన్నారు.మరో మృతుడు రాజశేఖరకు భార్య రాధిక,కుమార్తె వైష్ణవి (10వ తరగతి),కుమారుడు కార్తీక్ (ఇంటర్మీడియట్)లు ఉన్నారు. రెండు కుటుంబాల్లో అలముకున్న విషాదం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వెంకటరమణ,రాజశేఖర్ కుటుంబాల్లో విషాదం నెలకొంది. తమ కుటుంబ పెద్దలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని వార్త తెలియగానే కుటుంబ సభ్యులు,బంధువులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.వీరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.దేవుడా ఎందుకు మాకు ఇంత అన్యాయం చేశావంటూ గుండెలవిసేలా బోరున విలపించారు.ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Namitha News