నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి -- మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్ అంస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ కి వెంటనే జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ, పట్టణ కన్వీనర్ రామకృష్ణ లు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చాలీచాలని జీతాలతో ఉదయం 5 గంటలకే విధుల్లోకి వచ్చి వీధులను, కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ, చెత్త చెదారాన్ని ఎత్తేస్తూ పారిశుద్ధ్య మెరుగుకు ఎంతో పని చేస్తున్నామన్నారు తమకు చాలీచాలని జీతాలతోనే జీవితాలను నెట్టికొస్తున్నామని, కుటుంబాలు గడవడం కష్టతరంగా మారిందన్నారు. ఇస్తున్న తక్కువ జీతం కూడా నెలలు తరబడి బకాయిలు పెట్టడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టతరంగా మారిందన్నారు. మార్చి నెల జీతం ఏప్రిల్ 21వ తేదీ అవుతున్నా ఇవ్వకపోవడంతో తాము ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 నుంచి 25 ఏళ్ల పాటు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేసి నిర్మాణాలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని కోరారు. తమకు కడుపు మండినందునే ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. తమను ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ సకాలంలో జీతాలు చెల్లించకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి తమ జీతాలను వెంటనే విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, రామచంద్ర, కృష్ణప్ప, రాజు, మంజుల, శివమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News