నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 15 : మదనపల్లి పట్టణం కు జూన్ 20న జలధార భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లికి వస్తున్న సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతంలో త్రాగునీరు, సాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే హంద్రీనీవా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించి చెరువులను నింపే కార్యాచరణను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో మదనపల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మదనపల్లి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, మదనపల్లి-రామసముద్రం రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించాలని కోరారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన మదనపల్లిలో టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే నూతన ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఆరోగ్యం, విద్య, రోడ్లు, తాగునీరు, ఉపాధి వంటి ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం భూమి పూజ భహిరంగ సభకే పరిమితం కాకుండా, మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి స్పష్టమైన హామీలు, నిధుల కేటాయింపులు ప్రకటించాలి. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Reporter
Namitha News