నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల అభివృద్ధికి సమగ్ర కృషి – విద్య, రాజకీయాల్లో ప్రోత్సాహం కురబల అభ్యున్నతి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లెరెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మన్న తెలిపారు. శుక్రవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 14న మదనపల్లెలో కురబ, కురమ రాష్ట్ర స్థాయి నూతన కమిటీని డివిజన్ కమిటీ తరఫున ఘనంగా సన్మానించిన సందర్భంగా సహకరించిన ప్రతి కులబాంధవులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కురబలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. కురబల శ్రేయస్సు కోసం నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలోని కురబలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎదగాలని ఆశించే వారికి అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న కురబ విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కాంతారావు, రఘునాథ్, డివిజన్ అధ్యక్షులు కప్పల శ్రీరాములు, జనరల్ సెక్రటరీ సదాశివ, సలహాదారు రెడ్డప్ప, అడ్వకేట్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News