నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 22 : ఈ నెల 26న స్థానిక మదనపల్లి బెంగళూరు రోడ్డు లోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో కన్నుల పండుగగా నిర్వహించి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లి కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలు నందు 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై డిఆర్ఓ మధుసూదన్ రావు, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి లతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు సమన్వయంతో పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వేదికను అందంగా అలంకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిధులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు. ప్రోటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు అందరికీ పంపించాలన్నారు. పెరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కన్నుల పండుగ సాగేలా సంసిద్ధం చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. బీటీ కళాశాల మైదానంలో షామియానా, కుర్చీలు, బారికేడింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని తహసీల్దార్, మునిసిపల్ కమీషనర్ లకు సూచించారు. జాతీయ జెండా ఎగరవేయుట, వేదిక అలంకరణ, సీటింగ్ ఏర్పాట్లు, త్రాగునీటి ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల జారీ, ప్రోటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు పంపిణీ తదితర అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవ్వాలన్నారు. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చే బస్సులను, కార్లు, ఆటోలు తదితర వాహనాలను దారి మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అత్యవసర చికిత్స, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకొనే విధంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో మదనపల్లి డిఎస్పి మహేంద్ర , సర్వే ఏ.డి. భరత్ కుమార్, డ్వామా పిడి వెంకటరత్నం, డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు, డి.ఎం.హెచ్.ఓ లక్ష్మీ నరసయ్య, ఐ.సి.డి.ఎస్. పి.డి హైమావతి, వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సుభాషిని, హౌసింగ్ పిడి రమేష్ రెడ్డి, బిసి వెల్ఫేర్ అధికారి నాగేంద్ర రాజు, ఏపీ ఎస్పీడీసీఎల్, జిల్లా అగ్నిమాపక, ఆర్డబ్ల్యూఎస్ , విద్యాశాఖ, జిల్లా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, సాంఘిక సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, జీఎస్టీ అధికారులు, ఇరిగేషన్ అధికారి, మదనపల్లి తాసిల్దార్, మదనపల్లి మున్సిపల్ అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు
Admin
Namitha News