నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 10న కృత్రిమ కాళ్ళు అందించడానికి ఉచిత సిఎస్ఆర్ క్యాంపు - వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి మదనపల్లె : పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈనెల 10వ తేది అనగా గురువారం ఉదయం 7 గంటలకు దివ్యాంగులకు అధునాతన కృత్రిమ కాళ్లను అందించడానికి ఉచిత సిఎస్ఆర్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ,వికలాంగుల,వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణకిషోర్ ఆదేశాల మేరకు చెన్నైకి చెందిన ఫ్రీడమ్ ట్రస్ట్ అనే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అన్నమయ్య జిల్లాలోని అవసర మైన దివ్యాంగులకు అధునాతన కృత్రిమ కాళ్లను సిఎస్ఆర్ కింద ఉచితంగా అందించడానికి ముందుకు వచ్చిందని తెలిపారు.ఈ కృత్రిమ కాళ్లను తయారు చేసి అందించడానికి ముందుగా అవసరమైన లబ్ధిదారులను గుర్తించి,వారి కాళ్లకు సంబంధించిన కొలతలు తీసుకోవాల్సి ఉంటుందని అందువల్ల,జిల్లా యంత్రాంగం సహకారంతో 10వ తేది కొలతలు తీసుకునే శిబిరాన్ని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జడ్పి హైస్కూల్ నందు నిర్వహించాలని నిర్ణయించారు.కావున జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన కోరారు.ఈ క్యాంపుకు వచ్చే దివ్యాంగులు ఆధార్ జిరాక్స్,డిజేబులిటీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు,ఫోటో తీసుకొని రావాలన్నారు.
Reporter
Namitha News