నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి హామీ సవరణలకు వ్యతిరేకంగా నిరసన - విబి-జి ఆర్ఎఎమ్ (జి) బిల్లు ఉపసంహరించాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం సవరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లోని గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలను రద్దు చేయాలన్నారు. చట్టబద్ద హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. యుపిఎ ప్రభుత్వంపై వామపక్షాలు తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం మౌలిక స్వభావాన్ని కేంద్ర ప్రభుత్వం మారుస్తోందన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (విబి-జి రాం జి) పేరుతో ఉపాధి హామీ పథకానికి ”రాంరాం” పలకనుందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పని హక్కుగా ఉన్న పాతచట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేయనున్నారని తెలిపారు. సాధారణ పథకంగా దీనిని మారిస్తే, ఈ పథకం కొనసాగవచ్చు లేదా రద్దు చేయవచ్చు అని అన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ కార్మికుల డిమాండ్ ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్నిమార్చేసి అవసరాన్ని బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. కొత్త పథకంలో పనిదినాలు 100 నుండి 125 రోజులకు పెంచనున్నట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టేందుకేనన్నారు. వ్యవసాయ పనులు రద్దీగా ఉండే సమయాల్లో 60 రోజుల ఉపాధిని నిలుపుదల చేయడం వల్ల అత్యంత అవసరమైన సమయాల్లో గ్రామీణ కార్మికులకు పని నిరాకరించబడుతోందని వివరించారు. తద్వారా వారిని కొద్దిమందిగా ఉండే భూస్వాములపై ఆధారపడేలా చేయడం గర్హనీయమన్నారు. యంజిఎస్ఆర్ ఈజిఎగా ఉన్న ఈ పథకం పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమేనన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుందని చెప్పారు. అంతేకాకుండా మరోవైపు 10 నుండి 40 శాతానికి రాష్ట్రాలపై భారం పెంచారని వివరించారు. ఈ పథకం అమలుకు ఇప్పటివరకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని తెలిపారు. కొత్త పథకం ప్రకారం ఖర్చును ముందుగా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత కేంద్రం తిరిగి ఆ సొమ్మును రాష్ట్రాలకు చెల్లిస్తామని చెబుతుందన్నారు. గ్రామీణీలకు మేలు చేసే పథకం పేరులో గాంధీ పేరుని తొలగించడం మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి టి. హరి శర్మ ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు ఐటియుసి నాయకులు కృష్ణమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మోహన్ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News