నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 11: శనివారం వేకువజామున సూర్యకిరణాలు సరిగ్గా నేలను తాకకముందే పుంగనూరు పట్టణం లోని భగత్ సింగ్ కాలనీ లో ఒక్కసారిగా ఖాకీల పహారా లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మదనపల్లి సబ్ డివిజన్ పోలీసు యంత్రాంగం అలికిడి లేకుండా కాలనీని చుట్టుముట్టింది. నేర రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ 'కార్డ ఆన్ సెర్చ్' ఆపరేషన్, అణువణువునూ జల్లెడ పట్టారు. సుమారు 50 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి, కాలనీలోని ప్రతి సందును, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు రికార్డులను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోదాల అనంతరం పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారికి భద్రతపై భరోసా కల్పిస్తూ మీ భద్రతే మా ప్రాధాన్యత, మీ వీధిలో అపరిచితులు తచ్చాడుతున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెనుకాడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలు ఆరా తీయాలని, వేసవి కాలంలో ఇంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు
ఆపరేషన్లో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ గారితో పాటు ఎస్సైలు అన్సార్ బాషా, రమణ, చంద్రశేఖర్, రమేష్ తమ సిబ్బందితో కలిసి ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించారు. సుమారు 50 మందికి పైగా సిబ్బంది ఏకకాలంలో రంగంలోకి దిగి కార్డ్ ఆన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Reporter
Namitha News