నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిన బిజెపి - పునరుద్ధరణకు మే డే స్పూర్తితో పోరాటాలే శరణ్యం - మే డే సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపు. - వాడ వాడ లా ఎర్రజెండా రెపరెపలు - మదనపల్లి పట్టణంలో సీఐటీయూ భారీ ప్రదర్శన - అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు నాడు కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగం చేసి 8 గంటల పని దినం మొదలుకొని అనేక హక్కులు సాధించుకుంటే నేడున్న బీజేపీ పాలకులు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని, మేడే స్ఫూర్తితో హక్కుల పునరుద్దరణ కోసం కార్మిక, కర్షక మైత్రితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం `మేడే` సందర్బంగా మదనపల్లి పట్టణంలోని సిటియం రోడ్డు నందు గ్రంధాలయం గ్రౌండ్ నందు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో మే డే సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథి గా సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు పాల్గొన్నారు. ముందుగా సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక కదిరి రోడ్డులోని భాగ్యలక్ష్మి మిషన్ నుండి ప్రారంభం అయిన కార్మిక ప్రదర్శన మల్లిఖార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండ్, అప్పారావు వీధి, నెహ్రు బజార్, చిత్తూరు బస్టాండ్, సుందరయ్య సర్కిల్, సిటియం రోడ్డు గుండా గొల్లపల్లి సర్కిల్ లో ఉన్న గ్రంధాలయం గ్రౌండ్ చేరుకున్నది. మేడే వర్ధిల్లాలి, లేబర్ కోడ్ లు రద్దు చెయ్యాలి, కార్మిక చట్టాలు పునరుద్దరించాలి, మతోన్మాదాన్ని తరిమికొడదాం, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యాలి అంటూ కార్మికులు ప్రదర్శన ఆద్యంతం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం హమాలీ యూనియన్ నాయకులు రమణ రావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా కోశాధికారి టి. హరింద్రనాథ్ శర్మ, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వరి, నాయకురాలు మధురవాణి, మున్సిపల్ యూనియన్ నాయకులు రామకృష్ణ, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి తదితరులు మాట్లాడుతూ అమెరికా పెట్టుబడి దారి దేశంలో కార్మిక వర్గం తిరగబడి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించడం జరిగిందని అన్నారు. ఈ పోరాటంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, రక్తపు మడుగులో తడిసిన జెండానే ఎర్ర జెండా అని అన్నారు. ఎర్ర జెండా అన్ని దేశాల్లో ఉందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన కార్మిక హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్ విధానం ఉందని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అమలు జరపడం లేదని విమర్శించారు. రాజధాని అమరావతిని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రాంట్ గా నిధులు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించాలని కోరారు. విభజన చట్టంలో ఉన్న విధంగా రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. సభలో ముందుగా ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ కుమార్తెలు స్నేహలత, స్వీచ్చలతల నృత్యం, అంగన్వాడీ బృందం ప్రదర్శించిన నాటకం, హమాలీ కార్మికులు వేసిన డాన్స్ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు కాయకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News