నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : ఓ మధ్యతరగతి రైతుబిడ్డ కొద్దో గొప్పో చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన పాలిట కాలేయ వ్యాధి కాలయముడై ప్రాణాన్ని కబలిస్తున్న దయనీయ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ నల్ల తిమ్మిరెడ్డి గారి పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి కుమారుడు అమరనాథరెడ్డిది ఓ మధ్యతరగతి రైతు కుటుంబం. అమరనాథరెడ్డి చదువు ముగించుకుని బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి తన భార్య పద్మావతి, ఏడేళ్ల చిన్నారితో కె ఆర్ పురం లో ఓ అద్దె ఇంట్లో సంతోషంగా జీవనం సాగించేవారు. ఈ పచ్చటి సంసారం సాగుతుండగా రెండేళ్ల క్రితం అమరనాథ్ రెడ్డికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. అప్పట్లో కుటుంబ సభ్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. ఆరోగ్యం కుదుటపడి యధావిధిగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటూ కాలం వెలదీస్తుండగా మరో మారు అమర్నాథరెడ్డి పై ప్రకృతి పగబట్టి కాలేయ వ్యాధి రూపంలో దాపురించింది. గత పది రోజులుగా బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సుమారు మూడు లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేక బెంగళూరు సెన్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్సలకు చేర్చారు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడంతో అప్పులు చేసి చికిత్సలు చేయించడంతో డబ్బు కర్పూర హారతిలా కరిగిపోతోంది తప్ప ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం అమరనాథరెడ్డిని ఐసీయూలో ఉంచి వారానికి డయాలసిస్ కోసం రెండున్నర నుండి మూడు లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావడంతో ఆ కుటుంబం నిర్గాంతపోయింది. అమర్నాథ్ రెడ్డి దయనీయ స్థితిని చూసి భార్య పద్మావతి, కుటుంబ సభ్యులు ఆ దేవుని మీద భారం వేసి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అమరనాథ్ రెడ్డి లివర్ ఆపరేషన్ కోసం ఇంకా 30 లక్షల వరకు అవసరం ఉంటుందని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న కూటమి ప్రభుత్వం అమరనాథరెడ్డి వైద్యానికి సహకరించాలని తంబళ్లపల్లె మండల టిడిపి నేతలు కోరుకుంటుండగా మనసున్న మారాజులు ఆదుకుంటారేమోనని అమర్నాథ్ రెడ్డి కుటుంబం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది
Reporter
Namitha News