నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 15: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎర్రచందనం కేసుల పురోగతిపై ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ.... కేవలం నిందితులను అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా, వారికి కోర్టులో కచ్చితంగా శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలి. చార్జ్ షీట్లను గడువులోపు దాఖలు చేయాలి. సాక్షుల విచారణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిరంతరం కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించాలి. గతంలో ఎర్రచందనం కేసుల్లో ఉన్న వారి కదలికలపై నిఘా ఉంచాలి. పరారీలో ఉన్న ముద్దాయిలు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారి కోసం అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారిని పట్టుకోవాలి. స్మగ్లింగ్ జరిగే ప్రధాన మార్గాలను గుర్తించి, చెక్ పోస్టుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలి. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, కోర్టు సిబ్బంది మరియు క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం.వెంకటాద్రి గారు, మదనపల్లి డిఎస్పీ బి.పావని గారు, పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News