నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి అని వ్యాఖ్యనించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ . మంగళవారం ఉదయం మదనపల్లి పట్టణం లోని శేష సాయి కళ్యాణ మండపంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, ఇన్చార్జ్ డిఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని డా.బిఆర్.అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని ఒకే వర్గానికి చెందిన నాయకుడిగా చూడడం సరైంది కాదని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజంలోని ప్రతి వర్గానికి మార్గదర్శకంగా ఉన్నాయని తెలిపారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను స్థాపించడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు మాత్రమే కాకుండా మహిళలు, కార్మికులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా విస్తృతమైన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. మహిళలకు స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజునుంచే ఓటు హక్కు కల్పించడం అంబేద్కర్ గారి దూరదృష్టికి నిదర్శనమని, సమాన పనికి సమాన వేతనం, విద్యా అవకాశాలు, ఉద్యోగాల్లో సమానత్వం వంటి అంశాలు మహిళా సాధికారతకు బలమైన పునాది వేశాయని అన్నారు. కనీస వేతనాల చట్టం, కార్మిక హక్కులు వంటి అనేక సంస్కరణలు ఆయన దూరదృష్టిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలిచిందని పేర్కొన్నారు
కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు షాజహాన్ భాష మాట్లాడుతూ... డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషిని స్మరించుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని అన్నారు. ఆయన అడుగుజాడలను ఆదర్శంగా తీసుకుని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిఆర్డిఏ సంయుక్తంగా పీఎం అజయ్ పథకం కింద 25 మంది లబ్ధిదారులకు రూ.27 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.ఏం. పర్వీన్ తాజ్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భావన, మదనపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జి.శివరాం, రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్ వై. సుదర్శనం, డివిఎంసి మెంబర్లు పి.శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఎస్. రామకృష్ణ, జి.వెంకటరమణ, బాస్ పి.టి.యం.శివప్రసాద్, ఏం.ఆర్.పి.ఎస్.నరేంద్ర, బహుజన సేన చందు, ఎస్సీ ఎస్టీ నాయకులు బొజ్జప్ప, దివాకర్, పోతపోలు రెడ్డప్ప, పి.వెంకటరమణ , దళిత సంఘర్షణ సంస్థ చిన్నప్ప, బి.రమణ వివిధ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News