నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణంలో 1,16,958 మంది ఓటర్లు - మునిసిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల - ఓటర్లు తమ పేర్లు,వివరాలను పరిశీలించుకోవాలి - మునిసిపల్ కమిషనర్ ప్రమీల వెల్లడి మదనపల్లె పురపాలక సంఘంలోని 48 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడిన ఆమె జాబితాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గతంలో ఉన్న 35 వార్డుల స్థానంలో ప్రస్తుతం 48 వార్డులకు ఓటర్ల జాబితాను రూపొందించినట్లు చెప్పారు.రాష్ట్ర ఎన్నికల సంఘం,పురపాలక పరిపాలన శాఖ మార్గదర్శకాల మేరకు జనవరి 01,2026ను అర్హత తేదీగా పరిగణించి,164-మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పట్టణ పోలింగ్ కేంద్రాల ఆధారంగా వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించినట్లు ప్రమీల వివరించారు.మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో మొత్తం 1,16,958 మంది ఓటర్లు ఉన్నారని కమిషనర్ తెలిపారు.వీరిలో 56,862 మంది పురుషులు,60,083 మంది మహిళలు,13 మంది ఇతరులు ఉన్నట్లు చెప్పారు.పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు 3,221 మంది అధికంగా ఉన్నారని పేర్కొన్నారు.ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలన కోసం మున్సిపల్ కార్యాలయం,తహసీల్దార్ కార్యాలయం,సబ్కలెక్టర్ కార్యాలయం,కలెక్టరేట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రమీల తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా జాబితా ప్రతులను అందజేస్తున్నట్లు చెప్పారు.అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి ఓటరు పేరు సంబంధిత మున్సిపల్ వార్డు జాబితాలోనూ ఉంటుందని స్పష్టం చేశారు.ముసాయిదా జాబితాలో పేరు,వయస్సు,చిరునామా,ఇంటి నంబరు తదితర వివరాల్లో తప్పులు లేదా మార్పులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో నేరుగా సవరణ చేయడానికి అవకాశం లేదని కమిషనర్ తెలిపారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఫారం-8 ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని అర్హులు ఫారం-6 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఈఆర్వో ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చన్నారు.ఈఆర్వో ఆమోదం అనంతరం అర్హులైన వారి పేర్లను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అనుబంధ ఓటర్ల జాబితాలో చేర్చనున్నట్లు ప్రమీల తెలిపారు.ప్రతి ఓటరూ ముసాయిదా జాబితాలో తమ పేరు,వివరాలను పరిశీలించుకోవాలని,ఏవైనా సవరణలు అవసరమైతే నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
Reporter
Namitha News