నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 09 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో యెన్.సి.సి విభాగం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఎం. బుచ్చి రాజుతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు అధికారులు హాజరై విద్యార్థులతో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం. బుచ్చి రాజు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్తో పాటు ఇతర వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరిస్తూ, యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన మరియు మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలను వివరించిన అధికారులు, వాటి వినియోగాన్ని నిరోధించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా యువత తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని ఇతరులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యపరుస్తామని పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ, విద్యాసంస్థలు, విద్యార్థులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వారి శక్తి, ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించేలా ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో మిట్స్ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News