నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ కి వినతిపత్రం అందచేసినట్లు ఆయన వివరించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు, సంస్థలు మరియు రాజకీయ పార్టీలు నిరసనలు తెలపడం ఒక రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని దీనిని సీపీఎం తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరసనకారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా మదనపల్లి పట్టణంలో ఒక ప్రత్యేక 'ధర్నా చౌక్'ను ఏర్పాటు చేయాల్సిన భాద్యత పోలీసులది కాదా అని ప్రశ్నించారు. పోలీసులు మున్సిపల్, రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ధర్నా చౌక్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. చిత్తూరు బస్టాండ్ వద్ద ఉన్న ఖాళీ స్థలం ధర్నా చౌక్కు అనువుగా ఉంటుందని పార్టీ తరపున ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
Namitha News