నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లి మండల పరిధి లోని కుక్కరాజుపల్లి వద్ద ప్రభుత్వం ఏపీఐఐసీ ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి రెండు మాసాల క్రితం భూసేకరణ చేపట్టారు. ఈ భూ సేకరణ పై స్థానిక రెడ్డి కోట, కుక్కరాజు పల్లె పంచాయతీలకు చెందిన కుక్క రాజు పల్లి దళితువాడ, పర్ల గొల్లపల్లి, ఈర్లవాండ్లపల్లి, రెడ్డి కోటకు చెందిన బిసి, ఎస్సీ వర్గాలకు చెందిన రైతులు తమకు జీవనాధారమైన భూములు ఇవ్వమని గత రెండు మాసాల క్రితం కడప-మదనపల్లి జాతీయ రహదారిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తమ భూములు లేకుంటే మేము జీవనాధారం కోల్పోతామని ఆత్మహత్యే శరణ్యమని బాధిత రైతులు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులకు లిఖిత పూర్వపు ఫిర్యాదులతో వారి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయమై గురువారం తాసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఏపీఐఐసీ భూముల రైతులతో మరోమారు భూములకు పరిహారం చెల్లింపు విషయమై సమీక్ష జరిపారు. నేను కూడా ఓ రైతు బిడ్డ నే మీకు న్యాయం చేయడానికి వచ్చానని రైతుల భూములకు పరిహారం సకాలంలో అందడంలో సహకరిస్తామని, ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం జరిగితే పలు కంపెనీలు నిర్మాణం జరిగి అభివృద్ధి జరుగుతుందని తద్వారా మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులు పెద్ద మనసుతో ఆలోచన చేయాలని నచ్చ చెప్పారు. రైతులు మా పెద్దల నుండి మా ప్రాణం తో సమానంగా చూసుకుంటున్న మా భూములను ఇచ్చేది లేదని తమ వాదన వినిపించి ససేమిరా అన్నారు.అయితే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మొత్తం 46ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి గుర్తించి సర్వేకి ఆదేశించారు. ఈ భూముల విషయమై ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని రైతులు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలని ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంతో మంచి జరుగుతుందని మరోమారు రైతులను కోరినా వారు వినిపించుకోలేదు. ఇక సబ్ కలెక్టర్ మీ మంచి కోసం నేను చెప్పేది చెప్పాను ఇక మీ ఇష్టం అని చెప్పి సమావేశం ముగించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, కుక్కరాజుపల్లి, రెడ్డి కోట కు చెందిన రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News