నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఏప్రిల్ 02 : బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. "బీసీ సింహగర్జన" సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్" వేదికగా "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగనుంది. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర యాదవ్ ఈ కఠోర దీక్షకు పూనుకున్నారని పార్టీ పేర్కొంది. *ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాల్సిన ఐదు కీలక డిమాండ్లు* *1.బీసీ రక్షణ చట్టం:* బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా "బీసీ రక్షణ చట్టాన్ని" వెంటనే అమలు చేయాలి *2.అమరావతిలో భూమి:* రాజధాని అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు, ఇతర అవసరాల కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాలి *3.సమగ్ర కులగణన:* రాష్ట్రంలో శాస్త్రీయ ప్రాతిపదికన సమగ్ర కులగణన చేపట్టి, బీసీల కచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలి *44% రిజర్వేషన్లు:* విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి *5.బీసీ కార్పొరేషన్లకు నిధులు:* నిర్వీర్యం చేయబడిన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి ప్రభుత్వం బీసీల సహనాన్ని పరీక్షించవద్దని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీసీవై పార్టీ హితవు పలికింది. ఈ ధర్మ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సంఘీభావం తెలిపి, విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.
Admin
Namitha News