నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 12 : ఓ యువకుడు ఓ గిరిజన యువతి ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తంబళ్లపల్లె మండలం లో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోపి దీన్నే పంచాయితీ బల్లాపురం పల్లె కు చెందిన ఓ గిరిజన యువతి (19) ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంటి వద్ద ఉండేది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గతంలో ఆ యువతి పాఠశాల చదువుకునే సమయం నుండే మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో నమ్మించాడు. ప్రేమ పేరుతో ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని యువకుడు నమ్మించి లొంగదీసుకున్నాడు. అతని మీద నమ్మకంతో తన బంగారు నగలు అతనికి ఇచ్చింది. తల్లిదండ్రులు నగల విషయమై యువతిని నిలదీయగా ఆ యువకుడు నుండి నగలు తిరిగి తెచ్చుకుంది.అనంతరం ఇరువురు ప్రేమ పేరుతో కలిసి తిరుగుతూ వచ్చారు. ఈ కోవలో ఈ ఏడాది ఏప్రిల్ 20న మదనపల్లి చౌడేశ్వరి కళ్యాణమండపం వద్ద ఆ యువతిని ఆ యువకుడు బంగారు చైను ఇస్తే అది కుదవ పెట్టి ఇద్దరం పెళ్లి చేసుకుందామని మరో మారు నమ్మించి చైన్ తీసుకొని వెళ్ళాడు. సాయంత్రం వరకు వేచి చూసిన యువతి అతను తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు మొహం చెల్లక ఆ యువతి తిరుపతిలోని తన సోదరి ఇంటికి వెళ్ళింది. ఏప్రిల్ 21, 22వ తేదీలలో ఆమె ఆ యువకునితో ఇంస్టాగ్రామ్ లో పెళ్లి చేసుకోవాలని నిలదీయగా ఆ యువకుడు కులాంతర వివాహం కుదరదని కావాలంటే ఉంచుకుంటానని పెళ్లి చేసుకోనని చెప్పడం తో ఆ యువతి తాను మోసపోయానని గ్రహించి తన స్వగ్రామం బల్లాపురం పల్లెకు చేరుకుని తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియజేసింది. తనకు జరిగిన అన్యాయం పై తన తల్లిదండ్రులతో కలిసి ఏప్రిల్ 30వ తేదీన తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో యువతికి తగిన న్యాయం జరగక పోవడంతో మే నెల నాలుగో తేదీన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి లిఖితపూర్వపు ఫిర్యాదు చేసింది. అక్కడ కూడా నాకు న్యాయం జరుగుతుందో లేదో నన్న ఆందోళన చెందిన యువతి మంగళవారం ఉదయం తన స్వగృహంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటా హుటిన 108 వాహనంలో చికిత్స నిమిత్తం తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మెడికల్ ఆఫీసర్ తేజస్వి ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్సల కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. *గిరిజన యువతి కి న్యాయం జరగాలి* ః. గోపి దిన్నె పంచాయతీ బల్లాపురంపల్లి లో ప్రేమ పేరుతో మోసపోయిన గిరిజన యువతికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సంఘటనపై ఆ యువతికి న్యాయం జరగాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ తోబాటు మదనపల్లి డిఎస్పి, ములకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదులు పంపుతున్నట్లు మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, గోపి దిన్నె హైస్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, గోపి దీన్నే పంచాయతీ మాజీ సర్పంచ్ సుధాకర్ ,మండల బీసీ నేత పురుషోత్తం, టిడిపి సీనియర్ నేత బురుజు వెంకటరమణ, తెలుగు యువత నరసింహులు మరియు టిడిపి నేతలు విలేకరులకు తెలిపారు
Reporter
Namitha News