నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 06 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నెహ్రు యువ కేంద్రం మరియు మిట్స్ ఎన్.ఎస్.ఎస్. వారి ఆధ్వర్యంలో “50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ: లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ” అనే అంశంపై యువ పార్లమెంట్ పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో 50 సంవత్సరాల క్రితం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మరియు భవిష్యత్ రాజకీయాలలో యువత పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురబలకోట ఎం.పి.డి.ఓ గంగయ్య మరియు నెహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని “50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ: లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ” అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ మాట్లాడుతూ 1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడిందని, ఆ సమయంలో పౌర హక్కులు నిలిపివేయబడ్డాయని, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించబడ్డాయని, ప్రతిపక్ష నాయకులు అరెస్టు చేయబడ్డారని తెలిపారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పరీక్షగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ గంగయ్య మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిపోయిందని, 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య శక్తిని చూపిందని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగం సర్వోన్నతమని, అధికారంలో ఎవరు ఉన్నా రాజ్యాంగాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ పి. రాజేష్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి చాలా అవసరమని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో గెలుపొందిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొనే అవకాశం పొందారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు నెహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్, గ్రామజ్యోతి సొసైటీ అధ్యక్షురాలు సుభద్ర, అసిస్టెంట్ డీన్ ఏ.వి పవన్ కుమార్, డాక్టర్ పి.రమేష్ రెడ్డి, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ పి. రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News