నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 04 : మదనపల్లి సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన ఎంబీఏ విద్యార్థులు పారిశ్రామిక పర్యటనలో భాగంగా బెంగళూరులోని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పారిశ్రామిక నిర్వహణ, సరఫరా గొలుసు నిర్వహణ , సామాజిక బాధ్యత వంటి అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజూ వేలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీ ఎత్తున పోషకాహార భోజనాన్ని ఎలా తయారు చేస్తారో, అలాగే సమర్థవంతమైన సరఫరా గొలుసు నిర్వహణ ద్వారా నిర్ణీత సమయంలో ఎలా పంపిణీ చేస్తారో విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అదేవిధంగా, ఇస్కాన్ కాంప్లెక్స్ మరియు వసంతపుర ప్రాంతాల్లో ఉన్న అత్యాధునిక స్వయంచాలక వంటశాలల పనితీరును సందర్శించి వాటి నిర్వహణ విధానాలను అధ్యయనం చేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సేవా సంస్థల నిర్వహణ విధానం, సమాజ సేవలో సంస్థల పాత్ర, జట్టుకృషి ప్రాముఖ్యత, కార్యాచరణ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యత వంటి అంశాలపై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. ఈ పారిశ్రామిక పర్యటనలో డాక్టర్ శిరీష, డాక్టర్ ఎలియ్యల అధ్యాపకుల బృందం మరియు 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News