నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 04 : బి.కొత్తకోట పట్టణంలో తోపుడుబండ్లమీద వివిధ రకాల చిన్నచిన్న వ్యాపారులు చేసుకునే కార్మికులు నగర పంచాయతీకి చెల్లించవలసిన దినసరి పన్ను (గేటు)ను,గత సంవత్సరం చెల్లించిన విధంగానే ప్రస్తుత టెండర్ దారునికి చెల్లిస్తామని, అంతకుమించి చెల్లించలేమని ఏఐటియుసి మండల అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.తంబయ్యశెట్టి, జి.రఘునాథ్ లు నొక్కి వక్కాణించారు.నూతన టెండర్ దారులు ఒక్కొక్క తోపుడు బండికి 30 నుంచి 50 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నందుకు నిరసనగా, ఏఐటియుసి బీ.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట తోపుడుబండ్ల కార్మికులతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జి.రఘునాథ్,ఎస్.తంయ్య శెట్టి లు మాట్లాడుతూ; బి.కొత్తకోట పట్టణంలో సుమారు 150 మందికి పైగా చదువుకున్న యువకులు మరియు పేదలు,మహిళలు తోపుడుబండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, పట్టణంలోని వీధుల గుండా చమటోడ్చి తమ బండ్లను నెట్టుకుంటూ, ఇంకోవైపున గొంతులు అరిగేలా అరుచుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలు లేని కారణంగా రోడ్లపై మండుటెండలును సైతం లెక్కచేయకుండా, ఒకవైపున వాహన దారులతోనూ, ఇంకోవైపున పోలీసులతో చివాట్లకు గురవుతున్నా కూడా వాటిని భరించి తమ కుటుంబాల పోషణకు,తమ పిల్లల చదువుల కోసం విధిలేని పరిస్థితులలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు.ఇలాంటి పరిస్థితులలో నూతన టెండర్ దారులు దినసరి గేటును పెంచడం చాలా అన్యాయమని,శారీరక శ్రమతో తలమీద,భుజాల మీద తమ సరుకులు మోసుకొంటూ వీధులలో అమ్ముకునే వారిని కూడా గేటు కట్టాలని వత్తి చేయడం ఇంకా చాలా దుర్మార్గమని ఆక్రోశం చెందారు.గత సంవత్సరం చెల్లించిన విధంగా స్థిరంగా ఒకేచోట వుండే తోపుడుబండ్లకు రోజుకు 20 రూపాయలు, వీధులలో తమ బండ్లను నెట్టుకుంటూ వ్యాపారులు చేసుకునే వారికి రోజుకు 10 రూపాయలు చొప్పున గేటు వసూలు చేయాలని, అలాగే తలమీద,భుజాల మీద బరువులు ఎత్తుకుని వ్యాపారులు చేసుకునే వారి వద్ద నుండి ఏమాత్రం కూడా పన్నులు వసూలు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఎర్రజెండా తోపుడుబండ్ల కార్మికులకు అండగా నిలబడి,ఎలాంటి పోరాటాల కైనా సిద్ధపడుతుందని హెచ్చరించారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ రమాదేవికి వినతి పత్రం సమర్పించారు.టెండరు దారులతో మాట్లాడి గతంలో మాదిరిగానే పన్నులు వసూలు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,తోపుడుబండ్ల కార్మికులు అక్బర్, అమీర్ భాష,నర్సింహులు, మస్తాన్,బద్రి,పర్వీజ్,బావాజాన్,రవి,రామానుజులు,నౌషాద్,వల్లి సాబ్, భాష,తోసిఫ్,జమీర్, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News