నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 : మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్కు సంబంధించిన ఐదేళ్ల పదవీకాలం 2021 మార్చి 18 నుండి 2026 మార్చి 17 సాయంకాలం వరకు కొనసాగి, నిర్ణీత గడువు నాటికి పూర్తయినది.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ సంస్థలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన దృష్ట్యా, పరిపాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలో పరిపాలన బాధ్యతలను తాత్కాలికంగా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహించనున్నది. ఈ క్రమంలో మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు నియమితులయ్యారు. బుధవారం ఉదయం మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు
ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సేవలలో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అలాగే నగర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ పరిపాలన పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు
ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ కు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది, అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News