నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 31 : నాడు కఠినమైన శిక్షణలతో కూడిన ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగంలో ఎలాంటి మచ్చ లేకుండా 29 ఏళ్లు పనిచేసి అధికారుల మన్ననలు పొంది, ఎనిమిది సంవత్సరాలుగా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా నేటితరం డ్రైవర్లకు సలహాలు, సూచనలందిస్తూ రెడ్డి బాష అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పెద్దమండెం మండల కేంద్రంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి వెలిగల్లు లో విద్యాభ్యాసం చేసిన రెడ్డి భాష 1997 లో ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం కోసం వారు ఇచ్చిన కఠినమైన శిక్షణలను తన మెరుగైన పనితనంతో అధిగమించి డ్రైవర్ ఉద్యోగం సంపాదించాడు. నాటినుండి బి.కొత్తకోట ఆర్టీసీ డిపోలో నాలుగు సంవత్సరాలు, మదనపల్లి-2 డిపోలో నాలుగు సంవత్సరాలు, కుప్పం డిపోలో రెండు సంవత్సరాలు, తిరుమల డిపోలో రెండు సంవత్సరాలు, మదనపల్లె-1 డిపోలో ఏకంగా 17 సంవత్సరాలు మొత్తం 29 సంవత్సరాలు ఆర్టిసి కి డ్రైవర్ గా సేవలందించాడు. ఈ మొత్తం ఆర్టీసీ సేవలలో తన డ్రైవింగ్ లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా సహచర ఉద్యోగులతో సమన్వయం తో ఎలాంటి మచ్చలేకుండా తన విధి నిర్వహణతో ఉన్నతాధికారుల నుండి ఉత్తమ డ్రైవర్ గా పలు మార్లు ప్రశంసలు అందుకున్నాడు. రెడ్డి భాష ఆర్టీసీకి చేసిన సేవలను గుర్తింపుగా ఆయనకు సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించింది. నేడు ఆయన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ గా నేటితరం డ్రైవర్లకు తన అనుభవాన్ని రంగరించి అమూల్యమైన సలహాలు, సూచనలు, చేస్తున్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం, ప్రయాణికుల భద్రత, సహచర ఉద్యోగుల తో సంఘీభావం, సమయపాలన పాటించడం ఉన్నతాధికారుల వద్ద గౌరవంగా వ్యవహరించడం, ఆర్టీసీ సంస్థ మనుగడకు ఇందన పొదుపుకు పంచ సూత్రాలు, డ్రైవింగ్ లో మెలుకువలు, సమయ స్ఫూర్తి, ఇంకా పలు అంశాలపై కూలంకషంగా అవగాహన కల్పించి ప్రయాణికుల క్షేమం తోపాటు సంస్థ అభివృద్ధికి తనవంతు సేవలు అందించాలని సూచనలు చేశారు. నేటి తరం ఆర్టీసీ డ్రైవర్ లకు ఆయన ఓ దిక్సూచిగా నిలిచి ఆదర్శంగా నిలవడం అభినందనీయం
Reporter
Namitha News