నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 25 : తంబళ్లపల్లె మండలం లోని రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తద్వారా పర్యావరణంతో పాటు మానవ మనుగడకు సహకరించాలని పోర్డు డైరెక్టర్ లలితమ్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రబీ సీజన్లో గుండ్లపల్లి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసి వేరుశెనగ, మొక్కజొన్న, మామిడి, కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు, ఆకుకూరలు, కూరగాయలు పండించి అధిక దిగుబడి సాధించి సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. మార్కెట్లో సైతం ప్రకృతి వ్యవసాయ పంటలపై ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారని మండలంలోని రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించాలన్నారు. నేడు ప్రభుత్వం సైతం ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి పలు రకాల సబ్సిడీలు ఇస్తోందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా చేసుకోవాలన్నారు. గుండ్లపల్లి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులు,కషాయాల పై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఆమె వెంట రమణ, వేట మల్లికార్జున, నరసింహులు, లక్ష్మన్న రైతులు ఉన్నారు
Reporter
Namitha News