నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రైబల్ కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు పలమనేరులో 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులు, గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ : సేవే లక్ష్యంగా పనిచేస్తున్న స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, ధాత్రి ఫౌండేషన్ సంస్థలు పలమనేరులో 30 మంది గిరిజనులు, ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశాయి. పలమనేరు పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సరుకులు అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి అవకాశాలు లేక జీవనం కష్టతరంగా మారుతోందన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూలీ పనులు కూడా దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సరుకులు రెండు నెలల పాటు ఉపయోగపడతాయని తెలిపారు. తమ సమస్యలను గుర్తించి తిరుపతి నుంచి స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, మదనపల్లి నుంచి ధాత్రి ఫౌండేషన్ వచ్చి సహాయం అందించడం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథంతో పనిచేస్తున్నాయని కొనియాడారు. పలమనేరు మండలంలో ఈ సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ బృందం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి, శ్రీమతి విజయ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదన్నారు. అవసరం, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలకు సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి అవసరమైన వారికి సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ సభ్యులు, వాలంటీర్లు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News