నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - డిసెంబర్ 12 : చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల గ్రామంలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మార్గశిర మాసం, అష్టమి తిది, శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకురాలు శ్రావణి స్వయంభు శ్రీ వైష్ణవి దేవి, అభయాంజనేయ స్వామి, నాగభైరవ స్వాములకు పంచామృత అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అష్టమి ప్రత్యేకతగా నాగభైరవ స్వామి సన్నిధిలో భక్తులు పంచదీపారాధనలు సమర్పించారు. కుజదోషం, సర్పదోషం నివారణకు, వివాహం కాని వారు, సంతానం కోరిక ఉన్న వారు, అనారోగ్యంతో ఉన్న భక్తులు అష్టమి రోజున పంచదీపారాధన చేయడం శ్రేయస్కరమని ఆలయ అర్చకురాలు తెలిపారు. చౌడేపల్లి, పుంగనూరు, మదనపల్లి మరియు పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్, ధర్మపత్ని ఉమామహేశ్వరి ఉభయ దారులుగా సేవలు అందించారు. ఆలయ ధర్మకర్త వినోద్కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Reporter
Namitha News