నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కాంక్రీటు మిల్లర్ బోల్తా.. కార్మికుడి చేయి తెగింది పరిస్థితి విషమం.. బెంగళూరుకు తరలింపు మదనపల్లెలో భవన నిర్మాణ పనుల సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ యువ కార్మికుడు తీవ్రంగా గాయపడి ఎడమ చేయిని కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కాంక్రీటు మిల్లర్ బరువును మట్టి దిమ్మెలు తట్టుకోలేక కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పట్టణంలోని గొల్లపల్లెకు చెందిన రమేష్ కుమారుడు పవన్ కళ్యాణ్ కాంక్రీటు మిల్లర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. స్థానిక ఎంఎల్ఎల్ ఆస్పత్రి సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో సెల్లార్ పనుల భాగంగా పిల్లర్ కాంక్రీటు వేస్తుండగా ప్రమాదం జరిగింది. మిల్లర్ నిలిపిన ప్రదేశంలోని మట్టి చరియలు ఒక్కసారిగా విరగడంతో భారీ యంత్రం ఒరిగిపోయి గునాదులు తీసిన లోయలో పడింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మోల్డింగ్ కమ్మీలపై మిల్లర్ పడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఎడమ చేయి ఇనుపరాడ్ల మధ్య ఇరుక్కుపోయి మోచేయి భాగం తెగిపోయింది ప్రమాదాన్ని గమనించిన సహచర కార్మికులు వెంటనే పవన్ కళ్యాణ్ను ఆటోలో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం అనంతరం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఇదిలా ఉండగా ఇనుపరాడ్లలో ఇరుక్కుపోయిన చేయి భాగాన్ని కార్మికులు బయటకు తీసి వైద్యుల సూచన మేరకు ఐస్ బాక్స్లో ఉంచి బెంగళూరుకు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఇంజనీర్ వైఫల్యం, మేస్త్రీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Reporter
Namitha News