నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి పట్టణంలో పలు బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు ప్రభుత్వ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు జి. పునీత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నరసింహా బార్ అండ్ రెస్టారెంట్తో పాటు మరికొన్ని మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బార్ వెనుక ద్వారం గుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, సమీపంలోని విద్యాసంస్థలు, ఆసుపత్రుల వల్ల విద్యార్థులు, రోగులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో మద్యం సేవించి అపరిశుభ్రం చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గతంలో ఫిర్యాదులు, పత్రికా కథనాలు వచ్చినా చర్యలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పునీత్ కుమార్, ప్రజారోగ్యం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంబంధిత బార్ను వెంటనే తొలగించడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న ఇతర మద్యం దుకాణాలపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Reporter
Namitha News