నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చరిత్రను తెలుసుకోవడం.. కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలి భారతదేశ చరిత్ర అత్యున్నతమైనదని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా అనేక చారిత్రక కళాఖండాలు, పురావస్తు సంపదలు ఉన్నాయని పురావస్తు విద్యార్థి మునీంద్ర పేర్కొన్నారు. మే 18న జరగనున్న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రను తెలుసుకోవడం, భావితరాలకు కాపాడి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భారతదేశ ఆవిర్భావం నుంచి ఆదిమానవుల జీవన విధానం, వివిధ తెగల సంస్కృతులు, రాజ్యాల పాలనా విధానాలు, రాజులు ఉపయోగించిన ఆయుధాలు, పనిముట్లు, ఆచార సంప్రదాయాలు వంటి ఎన్నో చారిత్రక ఆధారాలను మ్యూజియంలు ప్రజలకు అద్దం పట్టే కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు. మానవ నాగరికత పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రస్తుత తరం విద్యార్థులు చరిత్రపై అవగాహన పెంపొందించుకోవాలంటే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మ్యూజియంలను సందర్శించాలని సూచించారు. మ్యూజియంల ద్వారా విద్యార్థులు చరిత్రను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని, వారసత్వ సంపద పట్ల గౌరవ భావన పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక చరిత్ర, జానపద సంస్కృతి, పురాతన కళాఖండాలు, శిల్పాలు, శాసనాలను ఆయా జిల్లాల మ్యూజియంలలో భద్రపరిస్తే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మ్యూజియంల అభివృద్ధి ద్వారా పర్యాటక రంగంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మునీంద్ర తెలిపారు. చరిత్రను పరిరక్షించడం అంటే దేశ సంస్కృతిని కాపాడుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.
Reporter
Namitha News