నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : గ్రామీణ రోడ్లు - జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రహదారుల భద్రత పై కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రహదారుల భద్రత పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సంవత్సరం రహదారుల ప్రమాదాల వివరాలు, హిట్ అండ్ రన్ కేసులు, రహదారులపై భద్రత అవగాహన కార్యక్రమాలు, బ్లాక్ స్పాట్లపై (ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలు) తీసుకున్న చర్యలు, తదితర అంశాలను వివరించారు. రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి నేషనల్ హైవే లో కలిసే ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. అందులో ఎక్కువగా రాయచోటి, చిన్నమండెం, మదనపల్లి ఏరియాలో ద్విచక్ర వాహనాలు, తర్వాత నాలుగు చక్రాల వాహనాలతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గమనించామని తెలిపారు. అలాగే టాక్టర్లు ఎటువంటి లైట్లు , సిగ్నల్ లైట్లు లేకుండా ఉండుటవలన, వాహనాలకు సరైన లైట్లు లేకపోవటం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిపారు.మైనర్ డ్రైవింగ్ను అరికట్టేందుకు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకొని వారికి అవగాహన కల్పించడం జరిగిందని, తద్వారా మైనర్ డ్రైవింగ్ ను కొద్దిగా మెరుగుపడిందని తెలిపారు.గత సంవత్సరంతో పోలిస్తే జనవరి 26 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రమాదాలు తక్కువగా జరిగాయని పేర్కొన్నారు. జిల్లాలో జాతీయ రహదారులపై 18 బ్లాక్ స్పాట్లను గుర్తించామని వీటి మరమ్మత్తులు జరగాల్సి ఉందని తెలిపారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే రహదారుల వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు కలిసే అన్ని అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనుల కోసం పోలీస్ శాఖ మరియు ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో పని చేసి అవసరమైన పాయింట్లను గుర్తించాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో 2 మీటర్ల వ్యవధిలో రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ పనులన్నింటినీ ఏప్రిల్ 10వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నిధుల అవసరాలపై వెంటనే ప్రణాళికలు తయారు చేసుకుని నివేదికలు సమర్పించాలని, పంచాయతీల ద్వారా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ వద్ద వీధి దీపాల ఏర్పాటు మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు చెల్లించాల్సిన పరిహారం పెండింగ్లో ఉంటే వెంటనే అవసరమైన పత్రాలు సమర్పించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ వెహికల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా టమోటా యార్డ్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు మార్కెట్ నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గాలు గా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను పరిశీలించాలని మునిసిపల్, రెవెన్యూ , ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని అధికారులు హెచ్చరిస్తూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణయించిన గడువులోపు పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు
ఈ సమావేశంలో రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, ఆర్ అండ్ బి శాఖ అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి, హైవే అధికారులు, డి.ఎం.హెచ్.ఓ , పోలీస్ శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News