నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 11 : అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి సర్వజన ఆసుపత్రి కి చికిత్సల కోసం వచ్చే రోగులకు, వారి అటెండర్లకు నరకం తప్పడం లేదు. రోగులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందుకు పడుతుంటే మరో వైపు వారివెంట అటెండర్లు గా వచ్చిన కుటుంబీకులను రాత్రి పూట లోపలికి అనుమతించక పోవడంతో వారు ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్ల నీడన చలికి వణుకుతూ దుప్పట్లు కప్పుకుని కాలయాపన చేయాల్సిన పరిస్థితి సోమవారం రాత్రి నెలకొంది. డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల అటెండర్లు, దోమ కాట్లు, వణికించే చలితో ఆస్పత్రి బయట జాగారం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో వరండాలు, ఆస్పత్రి పైభాగంలో వెయ్యి మంది ఒకేసారి ఉండే అంత సౌకర్యాలు ఉన్నా కూడా లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర కష్టాలు పడుతున్నట్లు మండిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న అన్యాయాలపై జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే తమకు ఈ కష్టాలు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లోపల వరండాలు లేక గదులలో పడుకోవడానికి అనుమతించకపోతే తాము ఎక్కడ పడుకోవాలని, ఆస్పత్రి బయట చలిలో ఉంటే పొరపాటున చలికి చనిపోతే ఎవరు బాధ్యులు చెప్పాలని మండిపడ్డారు. ఏదైనా జరగరానిది జరిగితే ఆసుపత్రి సిబ్బంది సూపరిండెంట్ మరియు ఆర్ఎంవో లే బాద్యులని ఆస్పత్రి బయట రోగుల అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల కష్టాలను జిల్లా స్థాయి అధికారులూ పట్టించుకోక పోవడంతోనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల వైద్యం గాడి తప్పుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
Reporter
Namitha News