నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎస్ఐఆర్ ప్రక్రియను సమన్వయంతో వేగవంతం చేయాలి ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలి: నిస్సార్ అహమ్మద్ : మదనపల్లి రూరల్ మండలంలోని కొత్తఇండ్లు గ్రామ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహమ్మద్ మంగళవారం పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో సహకరించారు. డిజిటైజేషన్ ప్రక్రియ పురోగతిపై సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేందుకు గడువు సమీపిస్తున్నందున అధికారులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా, ఎవరూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజలు కూడా అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించి ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. ఇర్ఫాన్, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు చిప్పిలి మల్లికార్జునరెడ్డి, ఈశ్వర్ నాయక్, బయ్యారెడ్డి, బీఎల్ఏలు ఖాజా, రోషన్, షంషాద్ బేగం, రామాంజి, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News