నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బాలికలపై అత్యాచారాలు దుర్మార్గం -- తీవ్రంగా ఖండించిన ఐద్వా -- శివాజినగర్ లో ధర్నా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బాలికలపై అత్యాచారాలు దుర్మార్గమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలు, చిన్నారుపైన జరిగిన లైంగిక దాడులను నిరసిస్తూ మంగళవారం మదనపల్లె పట్టణంలోని శివాజినగర్, విజయ్ నగర్ కాలనీల్లో ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ రోజురోజుకు పిల్లలపై, బాలికలపై, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమవుతున్నాయని ధ్వజమెత్తారు. నేరాలు జరిగిన తర్వాత పాలకులు, అధికారులు ప్రకటనలకే పరిమితమౌతున్నారు తప్ప శిక్షలు అమలు కావడం లేదన్నారు. తీవ్ర జాప్యం కారణంగా రాజకీయ అధికారిక అండదండలతో వెనకేసుకు రావడం నేరస్తులు దర్జాగా సమాజంలో తిరిగి అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. నేరం చేసిన వ్యక్తి ఎంతటి హోదాలో ఉన్నా చట్టం ముందు అందరినీ సమానంగా భావింవి, సమగ్ర విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం, డ్రగ్స్, గంజాయి వలన కుటుంబంలో సమస్యలు, మహిళలు, బాలికలు, చిన్నారులపై హత్యలు అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాల రక్షణ కల్పించి, న్యాయం జరగాలే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో మహిళా భద్రత పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు షాహిన, జిల్లా కోశాధికారి రెడ్డి ప్రసన్న, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Reporter
Namitha News