నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దుర్వాసన.. దుర్గంధం.. ఎటు చూసినా చెత్త కుప్పలే డ్రెయినేజీలు శుభ్రం చేయరా..? అధికారులను ప్రశ్నించిన నిస్సార్ అహమ్మద్ : మదనపల్లె పట్టణంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, ఎటు చూసినా చెత్త కుప్పలు, అపరిశుభ్రమైన డ్రెయినేజీలు, భరించలేని దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆరోపించారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలం కొత్తఇండ్లు పంచాయతీలో ఈఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాళ్ల సుబ్బన్న వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, చెత్త కుప్పలు, శుభ్రం చేయని డ్రెయినేజీలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రాంతాన్ని పరిశీలించిన నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని, తాళ్ల సుబ్బన్న వీధి అందుకు నిదర్శనంగా నిలుస్తోందని విమర్శించారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయి భరించలేని దుర్గంధం వెదజల్లుతోందని, డ్రెయినేజీలను శుభ్రం చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పారిశుధ్య నిర్వహణపై స్పెషల్ ఆఫీసర్లు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.కే. ఇర్ఫాన్, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు చిప్పిలి మల్లికార్జునరెడ్డి, ఈశ్వర్ నాయక్, బయ్యారెడ్డి, బీఎల్ఏలు ఖాజా, రోషన్, షంషాద్ బేగం, రామాంజి, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News