నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు కృషి చేయాలి జూన్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ : అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ఇందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత అవసరమన్నారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఏఈఓలు, బీఎల్ఓలు, డీఈఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటింటి సర్వే విధానం, ఎన్యుమరేషన్ ఫారముల నిర్వహణ, కొత్త ఓటర్ల నమోదు, సాంకేతిక అంశాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి కుటుంబాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ సర్వేలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారములు పంపిణీ చేసి అంగీకార పత్రాలు సేకరిస్తారని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఫోటో, చిరునామా, కుటుంబ వివరాల మార్పులను కూడా నవీకరించనున్నట్లు పేర్కొన్నారు. మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి గుర్తింపు, ఒకే వ్యక్తికి బహుళ ఓటరు కార్డులు ఉన్నట్లయితే వాటి తొలగింపు వంటి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. అర్హత లేని పేర్లు జాబితాలో లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఓటరు జాబితా సిద్ధమైన అనంతరం జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్, సవరణలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఓటరు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడైన వ్యక్తి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ హరి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News