నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 24 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగము వారు మిట్స్ ఐ.ఐ.ఐ.సి వారి ఆధ్వర్యంలో బెంగళూరు కు చెందిన వూల్లెమియా ఇన్ఫోసిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల మధ్య పరిశ్రమ–విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. వూల్లెమియా ఇన్ఫోసిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ చరణ్ గుడివాడ మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ లు అవగాహనా ఒప్పందం పై సంతకాలు చేసినారు. కార్యక్రమంలో చరణ్ గుడివాడ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సురక్షితమైన మరియు విశ్వసనీయమైన డిజిటల్ వ్యవస్థల కోసం కృత్రిమ మేధస్సు తో కూడిన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అనివార్యమైంది అని అన్నారు. ఏ ఐ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థలు భారీ పరిమాణంలో ఉన్న నెట్వర్క్, యూజర్ డేటాను వేగంగా విశ్లేషించి అనుమానాస్పద కార్యకలాపాలను తక్షణమే గుర్తించగలవని అన్నారు. మెషిన్ లెర్నింగ్ ద్వారా గత దాడుల నుంచి నేర్చుకుని, ఫిషింగ్, మాల్వేర్, ర్యాన్సమ్వేర్, జీరో-డే అటాక్స్ వంటి కొత్త తరహా బెదిరింపులను ముందుగానే గుర్తించి నివారించడంలో ఏఐ కీలక పాత్ర పోషితుందని అన్నారు. సైబర్ సెక్యూరిటీలో ఏఐ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.. సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లు (SOC), క్లౌడ్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, అనుమానాస్పద ఘటనలకు సంబంధించిన ఆధారాలను గుర్తించే ప్రక్రియ వంటి రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ ఈ ఒప్పందము ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, అకడమిక్ ప్రాజెక్ట్లు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ఆఫర్లలో అవకాశాలను అందించడం, విద్యా మరియు వృత్తిపరమైన వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు. అకడమియా మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్లో విద్యార్థులకు అత్యాధునిక పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను సమకూర్చడం కోసం ఈ ఎమ్ఓయు మరో మైలురాయిని సూచిస్తుంది అని ఆయన అన్నారు. కార్యక్రమం లో విభాగాధిపతి డాక్టర్ పద్మ, కో ఆర్డినేటర్ షాయీజ్, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News