నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండెం జూన్ 8 : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చిన్నమండెం మండలం, బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....గతంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,437 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నివారించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి చాలా మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అర్జీలు సమర్పించారన్నారు. వీరందరికీ జాబ్ మేళాల ద్వారా అర్హత మేరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. దీంతో ప్రజలు మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Reporter
Namitha News