నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 11 ః గుర్తుకు తెలియని దుండగులు నిండు పూత తో నున్న మామిడి తోటకు నిప్పు పెట్టడంతో దగ్ధమై సుమారు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిన దురదృష్టకర సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కోసువారిపల్లె పంచాయతీ దిగువ ముట్రవారిపల్లెకు చెందిన రైతు రఘునాథరెడ్డి, అమరావతి లకు చెందిన మూడు ఎకరాల మామిడి తోట ఫలసాయంతో జీవనోపాధి. ఈ ఏడాది సైతం మామిడి తోటకు అప్పులు చేసి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటంతో ఆశించిన స్థాయిలో పూత పూయడంతో ఆ రైతు కుటుంబం ఈ ఏడాది వచ్చే ఆదాయంతో కష్ట , నష్టాల నుండి గట్టెక్కవచ్చునని సంతోషించారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో మామిడి తోట పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రఘునాథరెడ్డి, అమరావతిలు తోటను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నోటికి వచ్చిన పంట దగ్ధమవడంపై చేసిన అప్పులు ఎలా తీర్చాలి రా దేవుడా అంటూ రోదించారు. ఈ విషయమై తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్న మామిడి తోట కాలి బూడిదవడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ మామిడి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News