నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 04 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో గత కొంతకాలంగా కల్తీ మద్యం కలకలంతో గతంలో ఇన్చార్జిగా వ్యవహరించిన దాసరిపల్లి జయచంద్ర రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిస్తేజంలో మునిగిపోయారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని అధికారం ఉండి కూడా చేతగాని వారిలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె టిడిపి నాయకులు మంగళవారం రాయచోటి లో ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని మొరపెట్టుకున్నారు. మంగళవారం టిడిపి నాయకులు ఇన్చార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజులను కలిసి తమ సమస్యలను వివరించారు. దశాబ్దాలుగా నిలిచిపోయిన తంబళ్లపల్లె-శివపురం రోడ్డు నిర్మాణం, తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయం పునర్నిర్మాణం, కోసువారిపల్లె మహిళా శక్తి భవన నిర్మాణం,పెద్దేరు ప్రాజెక్ట్ పార్క్ సుందరీ కరణ, చెరువుల కట్టలు , కాలువలు,మరమ్మతులు, కొట్టాల ఏటిగడ్డ, చౌడ సముద్రం ఏరు, దయ్యాలవారిపల్లె, పెద్దేరు ప్రాజెక్టు కింద బ్రిడ్జిల నిర్మాణం, చిన్నేరు, దబ్బలగుట్టపల్లి ప్రాజెక్టుల కాలువల భూముల రైతులకు పరిహారం,మల్లయ్య కొండపై గెస్ట్ హౌస్ల నిర్మాణం, మల్లయ్య కొండ, సింగల్ విండో, చైర్మన్ ల నియామకం, ఇంకా పలు సమస్యల ను మంత్రికి నాయకులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి తంబళ్లపల్లె ను సందర్శించి ప్రతి సమస్యను పరిష్కరించి తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు సహకరిస్తానని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భవిష్యత్తులో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండే నాయకున్ని ఇన్చార్జిగా నియమించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాయచోటి లో మంత్రులతో కలవడానికి తంబళ్లపల్లె మండలం నుండి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు
Reporter
Namitha News